కలం, వరంగల్ బ్యూరో : కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం వెంటనే అన్ని గ్రామాల్లో మక్కల కొనుగోలు సెంటర్లు ప్రారంభించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) డిమాండ్ చేశారు. రూ. 2400 మద్దతు ధర ఉన్న మొక్కజొన్నను రైతులు రూ. 1600-1700 లకే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. దీనితో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, మొక్కజొన్నను మద్దతు ధరకు కొని రైతులను ఆదుకోవాలని తెలిపారు. లేని పక్షంలో రైతులకు మద్దతుగా నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపడతామని, దీనికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ(Telangana) లో 8 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారని ఆయన వివరించారు. పంట మార్కెట్కు వచ్చి 15 రోజులవుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు తెరవలేదని అన్నారు. గతంలో కేసీఆర్ ముందు చూపుతో రైతులకోసం ఏ ఇబ్బంది లేకుండా నీళ్లు, రైతుబంధు, కొనుగోళ్ళ సెంటర్లు ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం రైతుల పాలిట శాపంలా తయారైందని విమర్శించారు.
Read Also: హాస్టల్ విద్యార్థులకు గుడ్ న్యూస్ : ఇక హైటెక్ వంటశాలలు
Follow Us On: Facebook

