కలం, వలిగొండ: భువనగిరి (Bhuvanagiri) మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి (83) చికిత్స పొందుతూ మంగళవారం నిమ్స్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. గోదావరి జలాల సాధన లక్ష్యంగా పోరాడిన జలసాధకుడు, పేదల కోసం 300 ఎకరాలు ఉచితంగా పంపిణీ చేసిన భూదాత, బీబీనగర్ నిమ్స్ (ఎయిమ్స్) కోసం ఆమర దీక్ష చేపట్టిన పోరాటయోధుడిగా ఆయన పేరు గడించారు. కొమ్మిడి నరసింహారెడ్డి 1943 మార్చి 10న స్వగ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో కొమ్మిడి రామచంద్రారెడ్డి-లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. నరసింహారెడ్డి భార్య సుకన్యమ్మ ఇటీవల మృతి చెందగా ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కొమ్మిడి నరసింహారెడ్డి (Kommidi Narasimha Reddy) నిస్వార్ధంగా ప్రజలకు సేవలు అందించడంతో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు 1962-70 రెండు సార్లు సర్పంచ్ గా, రెండుసార్లు భువనగిరి తాలూకా సమితి ప్రెసిడెంట్ గా పనిచేసినప్పటికీ నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ఆర్టీసీ బస్సులో, తన సొంత స్కూటర్ మీద ప్రయాణం సాగించేవారు. కొమ్మిడి నరసింహారెడ్డి తనకు వారసత్వంగా వచ్చిన 300 ఎకరాల భూమిని అర్హులైన పేదల వారికి ఉచితంగా పంపిణీ చేయగా ఆయన వృద్ధాప్యంలో సొంత ఇల్లు కూడా లేకుండా గడిపారు.
నర్సింహారెడ్డి గొప్ప రాజకీయవేత్త..
ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన గొప్ప రాజకీయవేత్త మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భువనగిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది తన జీవితాన్ని తన ఆస్తిని ప్రజా సేవ కోసం అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. నేడు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని, ఈ ప్రాంత ప్రజలకు తీరని లోటు అని అన్నారు.

