కలం, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ వెన్నుపూస లాంటిదని.. అదే విరిగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ప్లానింగ్, డిజైన్, ఆపరేషన్స్లో మొత్తం లోపాలే ఉన్నాయని పేర్కొన్నారు. మేడిగడ్డ నిర్మించిన ప్రాంతమంతా ఇసుకతో నిండిపోయి ఉందని, అక్కడ బ్యారేజీలు కడితే నిలవవన్నారు. అదే విషయాన్ని ఇంజినీర్లు చెప్పినా కేసీఆర్ వినిపించుకోకుండా కట్టేశారన్నారు.
బ్యారేజీల్లో నీళ్లు నింపలేం..
మేడిగడ్డ ప్రాజెక్టులో ఎట్టి పరిస్థితుల్లో నీరు నిల్వ చేయొద్దని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలా చేస్తే, కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకుపోతుందన్నారు. స్థాయికి మించి నీటిని నిల్వ చేయడం వలనే బ్యారేజీ కుంగిపోయిందన్నారు. మొదట నీటిని ఖాళీ చేసి, పరీక్షలు చేయాలని ఎన్డీఎస్ఏ సిఫార్సు చేయడంతోనే.. ఐఐటీ నిపుణులతో చేయిస్తున్నట్లు వివరించారు.
కేసీఆర్ దోపిడీకే ప్రాధాన్యం..
కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోపిడీకే ప్రాధాన్యం ఇచ్చారని సీఎం రేవంత్ అన్నారు. ఉద్యమకాలం నుంచే అదే విధానం అవలంబిస్తూ వస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, కూలగొట్టించినవారే.. ఇప్పుడు వారం రోజులు అవకాశం ఇస్తే తడాఖా చూపిస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేసింది ఆర్థిక ఉగ్రవాదం కంటే ఎక్కువని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

