కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయి ఎండలు నోరు లేని మూగజీవాలను సైతం అతలాకుతలం చేస్తున్నాయి. పట్టణాల్లోని సిమెంట్, తారు రోడ్లు మధ్యాహ్న సమయాల్లో నిప్పుల తివాచీలా మారుతుండటంతో వీధి కుక్కలు, ఆవులు, గేదెల కాళ్ల పాదాలు కాలిపోతున్నాయి. అటు అడవుల్లోని వాగులు, చెరువులు ఎండిపోవడంతో వన్యప్రాణులు దాహం తీర్చుకోవడానికి జనావాసాల వైపు వస్తున్నాయి. అటవీ అధికారులు సాసర్ పిట్స్ ద్వారా నీటిని సరఫరా చేస్తుండడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు.
ఈ నేపథ్యంలో, పల్లెలు, పట్టణాల్లోని స్థానిక సంస్థలు జంతువుల కోసం ప్రత్యేకంగా నీటి వసతి కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి తోడు సామాన్య ప్రజలు సైతం మానవత్వంతో స్పందించి, తమ ఇంటి ముందో, బాల్కనీల్లోనో, లేదా టెర్రస్ మీద మట్టి పాత్రల్లో చల్లని నీటిని, కాస్త ధాన్యపు గింజలను ఉంచాలని జంతు ప్రేమికులు ఎన్. దిలీప్ విజ్ఞప్తి చేస్తున్నారు. మనం చేసే ఒక చిన్న సాయం ఈ విపత్కర పరిస్థితుల్లో నోరు లేని జీవుల ప్రాణాలను కాపాడగలదని వారు గుర్తుచేస్తున్నారు.
వేసవిలో అటవీ జంతువుల దాహార్తిని తీర్చేందుకు అశ్వాపురం మండలంలోని తుమ్మలచెరువు బీట్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వన్యప్రాణులు నీరు తాగేందుకు అనుకూలంగా ఉన్న అడవిలోని పలు ప్రాంతాల్లో పెర్కోలేషన్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. వీటిలో వారానికి ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి నింపుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో, నీటి వినియోగం అధికంగా ఉండే ప్రాంతాల్లో నీటిని తరచుగా నింపుతున్నట్టు అక్కడి బీట్ ఆఫీసర్ రమేష్ తెలిపారు.

