కలం, వెబ్ డెస్క్: ఫ్యాక్షన్ రాజకీయాలకు సంబంధించి వైసీపీ అధినేత జగన్ బాధితుడు కాదని నిందితుడని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) విమర్శించారు. ఆయన తాత రాజారెడ్డి కాలం నుంచి ఫ్యాక్షన్ రాజకీయం చేస్తున్నారని.. అదే ఇప్పటికే కొనసాగుతుందన్నారు. జగన్ తనను తాను బాధితుడిగా చెప్పుకుంటున్నారని.. కానీ నిజానికి ఆయన నిందితుడని, ముద్దాయి అని ఆరోపించారు. శనివారం పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. నేరం–హింస సంస్కృతిని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా అణిచివేశారని.. ఫ్యాక్షనిజం ఏ పార్టీలో ఉన్నా ఆయన వదిలిపెట్టలేదని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో మళ్లీ ఆ సంస్కృతి పెరిగిందని వ్యాఖ్యానించారు.
రాజకీయాలు నేరమయం
రాష్ట్రంలో రాజకీయాలను నేరమయం చేసింది వైఎస్సార్సీపీనే అని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. నేరపూరిత రాజకీయ సంస్కృతి నుండి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావడానికి దాదాపు 30 సంవత్సరాలు పట్టిందని ఆయన అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏ పార్టీకి చెందినవారైనా సరే ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా నియంత్రించారని ఆయన పేర్కొన్నారు. జగన్ కుటుంబమే లేని ఫ్యాక్షనిజాన్ని రాజకీయాలకు జోడించి దాన్ని ఒక రాజకీయ పునాదిగా మార్చుకుందని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాష్ట్రంలో హింసాత్మక రాజకీయ వాతావరణాన్ని ప్రోత్సహించడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం జరిగిందని ఆయన విమర్శించారు.
హింసను ప్రోత్సహిస్తున్న జగన్
“రప్ప రప్ప నరుకుతాం” వంటి హింసాత్మక వ్యాఖ్యలు చేసే వారిని జగన్ ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు. అటువంటి వారితో జగన్ ఫొటోలు దిగుతున్నారని మండిపడ్డారు. వేటకొడవళ్లతో మేకలను బలి ఇచ్చి, రక్తాభిషేకం చేసే సంస్కృతిని జగన్ ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ను బాధితుడిగా చూపించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రాజకీయాలను నేరపూరిత దిశలోకి తీసుకెళ్లిన వ్యక్తిగా చరిత్రలో నిలుస్తారని విమర్శించారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలను పూర్తిగా నిర్మూలించిన చంద్రబాబు పాలనను ప్రజలు గుర్తించారని అన్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ నాయకత్వం మళ్లీ అదే హింసాత్మక రాజకీయ సంస్కృతిని కొనసాగిస్తోందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు.

