కలం, వెబ్డెస్క్: కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని బాదామి పట్టణంలోని చారిత్రాత్మక, పర్యాటక ప్రాంతమైన మేనబడిసి బాదామి గుహాలయాలు (Badami Cave Temples) దర్శించుకోవడానికి భారతదేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి ఏటా లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే ఈ ప్రదేశంలోని స్మారక స్థలంలోకి పురావస్తు శాఖ కార్యాలయంలో పనిచేసే మహిళా సిబ్బంది రోషిణి ముస్తాఫి చెప్పులు వేసుకుని ప్రవేశించింది.
దీనిపై అక్కడికి వచ్చిన ఓ మహిళా పర్యాటకురాలు (Tourist) తీవ్ర అభ్యతంరం వ్యక్తం చేసింది. చారిత్రక, పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో చెప్పులు వేసుకోవడం హిందూ సంప్రదాయాలను, మతపరమైన నమ్మకాలను గౌరవించకపోవడమే అని పర్యాటకురాలు సదరు సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సదరు ఉద్యోగి తాను అక్కడ విధులు నిర్వహిస్తున్నానని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నియమ నిబంధనలు పాటిస్తున్నానని స్పష్టం చేసినా.. మహిళా పర్యాటకురాలు వినకపోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ విషయంపై సంబంధిత అధికారులు అందరూ వచ్చి తనతో మాట్లాడాలని ఆ మహిళా పర్యాటకురాలు డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

