కలం, వెబ్డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్య నారాయణ (Botcha Satyanarayana) తన రాజకీయ వారసురాలిని అధికారికంగా ప్రకటించారు. తన కుమార్తె బొత్స అనూష (Botcha Anusha) రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనుందని స్పష్టం చేశారు. రానున్న జడ్పీ ఎన్నికల్లో విజయనగరం జడ్పీ చైర్పర్సన్ రేసులో అనూష తప్పకుండా ఉంటుందని బొత్స వెల్లడించారు. ఈ ప్రకటనపై బొత్స అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బొత్స కుమార్తె అనూష వైద్య వృత్తిలో ఉన్నారు. ఆమె ఇప్పటికే విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల జన్మదిన వేడుకలను సైతం పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. బొత్స భార్య ఝాన్సీ సైతం గతంలో ఎంపీగా పని చేశారు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో బొత్సకు ఉత్తరాంధ్రలో మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో అనూష రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. రానున్న జడ్పీ ఎన్నికలు అనూష రాజకీయ భవితవ్యానికి కీలకం కానున్నాయి.

