కలం, వెబ్డెస్క్: చిరుతిళ్లు.. పండ్లు.. కాయగూరలు.. కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా సాగుతోంది మార్కెట్లో ఆహార కల్తీ (Food Adulteration) దందా. ఇప్పటికే ఉప్పు, పసుపు, మసాలాలు, నూనెలు, ఐస్క్రీమ్లు, మాంసం, హోటళ్లలో దొరికే తిండి అంతా కల్తీమయం అని తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ వీడియో జనాలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తోంది. సమ్మర్లో అందరూ ఇష్టంగా తినే దోసకాయల (Cucumbers)ను కూడా కల్తీ చేసేస్తున్నారు. ఓ రైల్వే స్టేషన్లో కొందరు మహిళలు దోసకాయలను పొట్టు తీసి గ్రీన్ కలర్ రంగు నీళ్లు, రసాయనాల్లో ముంచి ఆకర్షణీయంగా కనిపించేలా చేసి అమ్మేస్తున్నారు. దీన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్తా వైరల్గా మారింది. రైళ్లలో ప్రయాణించే వారు ఎండ వేడిమి నుంచి ఉప శమనం కోసం తినే దోసకాయలను కూడా ఇలా కల్తీ చేయడం ఏమిటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ వీడియో బీహార్లోని కటిహార్ రైల్వే స్టేషన్లో తీసినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లకు తాము రోజూ తినే దోసకాయలు తాజావేనా అన్న అనుమానం కలుగుతోంది. ఇక దోసకాయల్లాగే పుచ్చకాయలను కూడా కోసి అమ్ముతారు. వాటిపైన కూడా ఇలాగే రంగులు పూస్తారా అని కొనుగోలు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా కల్తీ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. చిన్న వ్యాపారులు కల్తీ చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రైల్వేలో ఆహార కల్తీపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇక తాజా పండ్లు, కూరగాయలను కూడా ఇలా కల్తీ చేస్తుంటే కళ్లు మూసుకొని ఉంటారా అని అధికారులను ప్రశ్నిస్తున్నారు.

