కలం, వెబ్ డెస్క్ : బాలీవుడ్ ప్రముఖ నటుడు శక్తి కపూర్ (Shakti Kapoor) తన మరణం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. గత కొన్ని రోజులుగా ఆయన కన్నుమూశారంటూ పుకార్లు రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ వార్తలపై స్పందించిన ఆయన తాను పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నానంటూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అనవసరమైన ఫేక్ న్యూస్ను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
కేవలం ప్రచారం కోసమే ఇలాంటి అసత్యాలను సృష్టించడం సరికాదని శక్తి కపూర్ అభిప్రాయపడ్డారు. తనపై జరుగుతున్న ఈ విష ప్రచారాన్ని సీరియస్గా తీసుకున్న ఆయన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆషిఖీ-2 ఫేమ్ శ్రద్ధా కపూర్ తండ్రిగా సుపరిచితుడైన శక్తి కపూర్ దశాబ్దాలుగా వెండితెరపై తన విలక్షణ నటనతో గుర్తింపు పొందారు.

