కలం, వెబ్ డెస్క్: బ్రహ్మోత్సవాల్లో భక్తుల అత్యుత్సాహం మొదటికే మోసం తెచ్చింది. సంతోషంగా జరగాల్సిన వేడుకల్లో ఆటంకాన్ని సృష్టించింది. పుష్కరిణిలో కెపాసిటీకి మించి జనాలు తెప్పలోకి ఎక్కడంతో అది కాస్తా మునిగిపోయింది. ఈ ఘటన నెల్లూరు (Nellore) జిల్లాలో చోటు చేసుకుంది. కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తెప్ప మీది వచ్చారు. దీంతో బరువును ఆపలేక తెప్ప మునిగిపోయింది. అర్చకులు, భక్తులు స్వామివారి విగ్రహాలను గట్టిగా పట్టుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. బ్రహ్మోత్సవం ఏర్పాట్ల విషయంలో ఆలయ కమిటీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

