కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam) పరిధిలో గోదావరి నదిలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఉగాది సెలవుల సందర్భంగా స్నేహితులతో కలిసి నదిలో స్నానాలకు దిగగా ప్రమాదం జరిగింది. వివరాళ్లోకి వెళ్తే.. అమరావతిలోని ఎస్ఆర్ఎంటీ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కొందరు తమ మిత్రులు అభిరామ్, శ్రీకర్లతో కలిసి టూర్కొచ్చారు. ఎటపాక మండలం కొల్లిగూడెం ఇసుక ర్యాంప్ సమీపంలోని గోదావరి (Godavari) నదిలోకి దిగి ఫొటోలు తీసుకుంటుండగా, ఏడుగురు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరికి ఈత రావడంతో ఒడ్డుకుచేరుకోగా, మిగిలిన ఐదుగురు గల్లంతయ్యారు.
గల్లంతైనవారిని అభిరామ్, శ్రీకర్, తేజ, సతీష్, నవదీప్లుగా స్థానికులు పేర్కొంటున్నారు. ఇందులో అభిరామ్, శ్రీకర్ భద్రాచలం (Bhadrachalam) ప్రాంతానికి చెందినవారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రత్యేక రిస్క్యూ బృందం కూడా మృతదేహాల కోసం గాలిస్తోంది. ఈ ఘటనతో విద్యార్థి కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.
Read Also: గద్దర్ అవార్డుపై రష్మిక ఎమోషనల్ ట్వీట్
Follow Us On: Facebook

