కలం, వెబ్ డెస్క్: మధ్యాహ్నం భోజనం (Lunch) చేసిన తర్వాత చాలామందికి కాసేపు కళ్లు మూతలు పడటం, అలసటగా ఉంటుంది. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం తర్వాత విపరీతమైన నిద్రమత్తు రావడం అనేది రక్తంలోని చక్కెర స్థాయిలు (Blood Sugar) అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పడానికి సంకేతం కావచ్చు. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
శరీరంలో చక్కెర (Blood Sugar) స్థాయిలు అకస్మాత్తుగా పెరిగి, ఆ తర్వాత వెంటనే పడిపోవడాన్ని ఈ నిద్రమత్తు సూచిస్తుంది. తిన్న ఆహారం గ్లూకోజ్గా మారినప్పుడు, దానిని నియంత్రించడానికి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ను విడుదల చేస్తుంది. ఒకవేళ ఇన్సులిన్ పనితీరులో లోపాలున్నా భోజనం తర్వాత శరీరం శక్తిహీనతకు లోనవుతుంది. దీనివల్ల పనిపై ఏకాగ్రత తగ్గుతుంది. అలాగే దీర్ఘకాలంలో డయాబెటిస్కు దారితీసే ప్రమాదం ఉంది.
ఈ సమస్యను అధిగమించడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. భోజనంలో కేవలం పిండి పదార్థాలు మాత్రమే కాకుండా తగినంత ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. ఇది రక్తంలో గ్లూకోజ్ ఒక్కసారిగా పెరగకుండా అడ్డుకుంటుంది. భోజనం తర్వాత కనీసం పది నిమిషాల పాటు నడవడం వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఒకవేళ ప్రతిరోజూ భోజనం తర్వాత అలసట వేధిస్తుంటే వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెప్తున్నారు.
Read Also: రికార్డు ధర పలికిన రవివర్మ పెయింటింగ్.. ఎన్ని కోట్లంటే..?
Follow Us On : WhatsApp

