కలం, వెబ్ డెస్క్: ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన ఓ పెయింటింగ్ (Ravi Varma Painting) రికార్డు ధరకు అమ్ముడైంది. భారత్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన కళాఖండంగా చరిత్ర సృష్టించింది. బుధవారం ముంబైలో జరిగిన సాఫ్రాన్ ఆర్ట్ స్ప్రింగ్ ఈ పెయింటింగ్ లైవ్ వేలం జరిగింది. రాజా రవివర్మ గీసిన యశోద అండ్ కృష్ణ (Yashoda and Krishna) అనే తైలవర్ణ చిత్రం ఏకంగా రూ.167.20 కోట్లకు (సుమారు 1.79 కోట్ల డాలర్లు) అమ్ముడై సరికొత్త రికార్డు నెలకొల్పింది. గతేడాది ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ‘గ్రామ్ యాత్ర’ చిత్రం సాధించిన రూ.118 కోట్ల రికార్డును ఇది బ్రేక్ చేసింది.
సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సైరస్ ఎస్.పూనావాలా (Cyrus Poonawalla) ఈ చారిత్రాత్మక చిత్రాన్ని వేలంలో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఈ జాతీయ సంపదను సంరక్షించే అవకాశం రావడం నా అదృష్టం. రాబోయే కాలంలో ఈ అపురూప చిత్రపటాన్ని ప్రజలందరూ వీక్షించేలా ప్రదర్శనకు ఉంచుతాం” అని పేర్కొన్నారు. మొదట ఈ చిత్రం రూ.80 కోట్ల నుంచి 120 కోట్ల మధ్య ధర పలుకుతుందని అంచనా వేశారు. కానీ, ఊహించని రీతిలో భారీ ధరను దక్కించుకోవడం విశేషం.
1890లలో రాజా రవివర్మ కెరీర్ టాప్లో ఉన్నప్పుడు సృష్టించిన ఈ పెయింటింగ్ (Ravi Varma Painting) మాతృత్వంలోని గొప్పతనాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. యశోద ఆవు పాలు పితుకుతుండగా, వెనుక నుండి బాలకృష్ణుడు పాల పాత్ర కోసం చేయి చాస్తున్న దృశ్యం వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. పురాణ గాథలోని ఒక సన్నివేశాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో, కళాత్మకంగా తీర్చిదిద్దిన ఈ చిత్రం రవివర్మ బెస్ట్ క్రియేషన్స్లో ఒకటిగా నిలుస్తోంది.
Read Also: సమంత హెల్త్ సీక్రెట్స్ ఇవే.. ఉదయాన్నే ఇవి పాటించేయండి!
Follow Us On: Instagram

