కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad) చూడిబజార్కు చెందిన అశోక్ తివారి ఏప్రిల్ నెల 21న గ్యాస్ సిలిండర్ బుక్ చేశారు. డెలివరీ సమయంలో 2 కిలోల బరువు తక్కువగా ఉండటాన్ని ఆయన కుమారుడు నమాన్ గమనించారు. నిబంధనల ప్రకారం 30.4 కిలోలు ఉండాల్సిన సిలిండర్, కేవలం 28 కిలోల బరువు మాత్రమే ఉందని గుర్తించారు. దీంతో వెంటనే సిలిండర్లు సరఫరా చేస్తున్న సిద్ధార్థ ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీ ప్రతినిధులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో, అసలు ఏం జరుగుతోందని ఆరా తీశారు. ఏజెన్సీ ఉద్యోగులే సిలిండర్లను అక్రమంగా చిన్న సిలిండర్లలోకి, వాణిజ్య అవసరాల కోసం రీఫిల్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో వారిపై గోషామహల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. అయిదుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద, చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
సీపీ సజ్జనార్ అభినందన..
గ్యాస్ ఏజెన్సీల అక్రమ దందాను వెలుగులోకి తెచ్చిన తండ్రీ కొడుకులు అశోక్ తివారి, నమాన్ను హైదరాబాద్ సీపీ సజ్జనార్ తన కార్యాలయానికి పిలిపించుకుని అభినందించారు. యూనిఫామ్ లేని పోలీసులా వ్యవహరించి, వ్యవస్థలోని అక్రమాలను ధైర్యంగా ప్రశ్నించారని ప్రశంసించారు. సమాజంలో జరిగే అక్రమాలపై ప్రతి పౌరుడు ఇలాగే చైతన్యంతో స్పందిస్తే నేరస్థులే ఉండరని సీపీ పేర్కొన్నారు.

