కలం, వెబ్డెస్క్: తెలంగాణ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుభవార్త చెప్పారు. జూన్ 1 లోగా ఆరోగ్య భద్రత కార్డులను ఉద్యోగులకు అందిస్తామని తెలిపారు. శనివారం ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సహకారంతోనే రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ విజయవంతం అయ్యాయని అన్నారు. ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు భుజాన వేసుకొని పని చేశారన్నారు. ఉద్యోగుల సహకారంతోనే సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయగలుగుతున్నామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. ఉద్యోగులకు ప్రతీ నెలా మొదటి తారీఖున వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించామని స్పష్టం చేశారు. ఉద్యోగుల బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం నిర్వహించామని వెల్లడించారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న టీచర్ల బదిలీలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేశామని తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కార్డుల ప్రతిపాదనపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఈ రెండేళ్లలో ప్రజా ప్రభుత్వంలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు సీఎం వెల్లడించారు.
వంద రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ.6 వేల కోట్లు చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ నిధుల ఖర్చు ప్రాధాన్యతల నిర్ణయం ఉద్యోగ సంఘాలదేనని సీఎం అన్నారు. పీఆర్సీపై తక్షణమే రిపోర్టు అందించాలని అధికారుల కమిటీని ఆదేశించినట్లు తెలిపారు. రిపోర్టు ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. జూన్ 1 లోగా ఆరోగ్య భద్రత కార్డులను ఉద్యోగులకు అందిస్తామని సీఎం తెలిపారు. ప్రతీ రెండు నెలలకు ఒకసారి గుర్తింపు సంఘాలు సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు అందించాలని సూచించారు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం తమ బాధ్యత అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యోగ సంఘాల నాయకులు ధన్యవాదాలు తెలిపారు. సీఎం నేతృత్వంలో గతంలో చాలా వరకు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందని గుర్తు చేసుకున్నారు. వైద్య విధాన పరిషత్ లో 13,100 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. పీఆర్సీ, హెల్త్ కార్డుల సమస్యలతో పాటు ఉద్యోగ సంఘాల ఇతర డిమాండ్లను పరిష్కరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

