కలం, ఖమ్మం బ్యూరో: జిల్లాలోని రైతాంగానికి వ్యవసాయ రుణాల (Agricultural Loans) ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. రైతులు వ్యవసాయ రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా తమ మొబైల్ నుంచే దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ‘కృషీ కా’ మొబైల్ యాప్ను ఆవిష్కరించిందని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని రైతులందరూ ఈ సరికొత్త డిజిటల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
గతంలో వ్యవసాయ రుణాలు లేదా కిసాన్ క్రెడిట్ కార్డ్ వంటి సేవల కోసం రైతులు తమ పనులన్నీ మానుకుని బ్యాంకుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేదని, ఈ ఇబ్బందులను పూర్తిగా తొలగించే ఉద్దేశంతోనే కేంద్ర వ్యవసాయ శాఖ ఈ సరికొత్త ప్లాట్ఫామ్ను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఈ యాప్ (Krishi Ka App) ద్వారా రైతులు దళారులు లేదా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తమ స్మార్ట్ఫోన్ నుంచే రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. దీనివల్ల రైతులకు బ్యాంకులకు తిరిగే శ్రమ తప్పడమే కాకుండా, సమయం, ప్రయాణ ఖర్చులు కూడా ఎంతగానో ఆదా అవుతాయని వివరించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైతులందరూ మారుతున్న సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ డిజిటల్ సేవలను ఉపయోగించుకుని ‘కృషీ కా’ యాప్ ద్వారానే వ్యవసాయ రుణాలకు అప్లై చేసుకోవాలని రామిరెడ్డి సూచించారు. జిల్లాలోని బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు కూడా ఈ యాప్ వినియోగంపై గ్రామాల్లో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

