కలం, వెబ్ డెస్క్: కొంత సమయం గడపాలంటే రాజకీయ స్నేహితులు తప్ప మిగతా వారు తెలియదని.. తనకు ఉన్న పెద్ద సమస్య ఇదేనని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. బెంగళూరులో జరుగుతున్న ‘ది హిందూ హడిల్ 2026’ లైవ్ సెషన్ చర్చకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. జులై 4, 2026 నాటికి ప్రజా జీవితంలో 20 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నట్లు వివరించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ రాజకీయ ప్రస్థానంలో జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ పదవులు నిర్వర్తించి.. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినట్లు వివరించారు.
రోజుకు 16 గంటలు పనిచేస్తా..
ఈ చర్చలో ది హిందూ ఎడిటర్ ఎన్.రామ్ సీఎం రేవంత్ రెడ్డిని ఆసక్తికర ప్రశ్నలు అడగగా సమాధానాలిచ్చారు. ‘నేను రోజుకు 16 నుంచి 18 గంటలు పని చేస్తా. ఇతర వ్యాపకాలు ఏం లేవు. ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. ఐఎస్బీ, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకునే కొందరు విద్యార్థులతో మాకో టీం ఉంది. వాళ్లకు రాజకీయాలు తెలియవు. వారితో కలిసి రాత్రి 10, 11 గంటల తర్వాత ఫుట్బాల్ ఆడుతుంటాను. సీఎం అయ్యాక ఆట ఆడేందుకు సమయం దొరకడం లేదు. అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీకి అభిమానిని. అందుకే ఆయన్ను హైదరాబాద్కు ఆహ్వానించి కార్యక్రమం ఏర్పాటు చేశాం. తద్వారా, తెలంగాణ యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నాం’ అన్నారు

