కలం, వెబ్ డెస్క్: తిరుపతి (Tirupati) జిల్లాలో ఏనుగులు జనావాసాల్లోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల గుంపులు గుంపులుగా వచ్చి పంటలను ధ్వంసం చేసిన ఏనుగులు ఇప్పుడు ఏకంగా మనుషులపై దాడులు చేస్తున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండలం పల్లగుట్టపల్లి గ్రామంలో ఏనుగు దాడి (Elephant Attack)లో ఓ రైతు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. తిమ్మారెడ్డి అనే రైతు పంట కాపలా కోసం శుక్రవారం రాత్రి ఒంటరిగా పొలం వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడికే ఓ ఏనుగు ఉన్న విషయం గుర్తించలేదు. తిమ్మారెడ్డి పొలం వద్దకు వస్తుండగా ఏనుగు ఒక్క సారిగా ఆయనపై దాడి చేసింది. కింద పడేసి తొక్కేసింది. దీంతో తిమ్మారెడ్డి శరీరం రెండు భాగాలుగా విడిపోయి మృతి చెందాడు.
ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఏనుగుల సంచారం, వాటి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమీప గ్రామ ప్రజలకు సమాచారం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి దుర్ఘటన జరగడం బాధాకరమన్నారు. తిమ్మారెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటవీ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం ఆ కుటుంబాన్ని పరామర్శించి తక్షణమే పరిహారం అందించాలని ఆదేశించారు.

