కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా పరిధిలో అక్రమ మద్యం విక్రయాలు, నిల్వలు, బెల్ట్ షాపుల నిర్వహణను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ (Excise Department) కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి తెలిపారు. గత కొన్ని నెలలుగా చేపట్టిన దాడుల ఫలితంగా జనవరి 2026 నుంచి ఇప్పటి వరకు మొత్తం 64 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులకు సంబంధించి 62 మంది నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిని చట్టప్రకారం సంబంధిత ఎమ్మార్వోల ముందు హాజరుపరచి, వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
ఈ చర్యల ద్వారా భవిష్యత్తులో ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడకుండా నిరోధక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దాడుల సమయంలో సుమారు 300 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇకముందు కూడా జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం నిల్వ, రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ శాఖ (Excise Department) హెచ్చరించింది.
Read Also: 16 ఏళ్ల పాటు ‘నో డిగ్రేడేషన్’.. బ్యాటరీ రంగంలో చైనా సంచలన ఆవిష్కరణ!
Follow Us On : WhatsApp

