కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) ప్రశాంతంగా ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ప్రకటించింది. ఎక్కడా పెద్ద ఎత్తున అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా అమలయ్యాయని ఈసీ వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో నేటి సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్రంలో అమలులో ఉన్న ఎన్నికల కోడ్(Election Code)ను ఎత్తివేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.
అలాగే, ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటూ మరణించిన అధికారులు, సిబ్బంది కుటుంబాలకు తక్షణమే పరిహారం చెల్లించాలని ఈసీ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. పరిహారం చెల్లింపు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించింది.
ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అధికారులు, పోలీస్ సిబ్బంది, ఇతర సిబ్బంది సేవలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అభినందించింది. శాంతియుతంగా ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది. పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) విజయవంతంగా ముగియడంతో రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాస్వామ్య ప్రక్రియ మరింత బలోపేతమైందని ఈసీ వెల్లడించింది.
Read Also: రేవంత్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టడు : హరీష్ రావు
Follow Us On: X(Twitter)


