కలం, వెబ్డెస్క్ : తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ డీఎంకే ప్రభుత్వం యువత, విద్యార్థులను ఆకర్షించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మరో రెండు నెలల్లో 10 లక్షల మందికి ల్యాప్టాప్లు అందజేయనున్నట్లు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్(MK Stalin) హామీ ఇచ్చారు. మొత్తం రెండేళ్లలో 20 లక్షల మందికి ఈ ల్యాప్టాప్లు అందేలా ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన ఈ స్కీమ్ను వేగవంతం చేస్తూ మే నెలలోనే అంతర్జాతీయ టెండర్ ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఈ పథకం అమలుపై పలు సమీక్షలు నిర్వహించారు.
డిసెంబర్ నుంచి పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని, తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దీనిని ప్రారంభించనున్నట్టు సమాచారం. ఈ ల్యాప్టాప్లు ప్రభుత్వ, ఇంజినీరింగ్, వ్యవసాయ, మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు అందనున్నాయి. ముఖ్యంగా మూడో సంవత్సరం చదువుతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. గతంలో ఏఐఏడీఎంకే ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత ల్యాప్టాప్ స్కీమ్(Free Laptop Scheme)ను కోవిడ్ కారణంగా నిలిపివేశారు. ఇప్పుడు డీఎంకే దానిని పునరుద్ధరిస్తూ మరింత విస్తృతంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నది.
నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) యువతలో ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో డీఎంకే ఈ ఎత్తుగడ వేసినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల డిజిటల్ నైపుణ్యాలు మెరుగుపడతాయని, ఆధునిక సాంకేతికతతో కూడిన ల్యాప్టాప్లు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Read Also: జీ-రామ్-జీ బిల్లుకు లోక్సభ ఆమోదం
Follow Us On: Instagram


