కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 38 పట్ల తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGJLA-475) హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా బదిలీలకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వస్కుల శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేశ్ ధన్యవాదాలు తెలిపారు. అయితే, ప్రస్తుతం జారీ చేసిన ఉత్తర్వుల్లోని మూడు సంవత్సరాల నిబంధన వల్ల జూనియర్ లెక్చరర్లకు తీరని అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిబంధన వల్ల కలిగే ఇబ్బందులను వివరిస్తూ ముఖ్యమంత్రి, విద్యాశాఖ కార్యదర్శికి, ఇంటర్ విద్య డైరెక్టర్ కు వారు ఆన్ లైన్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. గత 15 సంవత్సరాలకు పైగా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేసి, జీవో నెంబర్ 16 ప్రకారం మే 2023లో క్రమబద్ధీకరించబడిన అధ్యాపకులు ఈ కొత్త నిబంధన వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని వారు పేర్కొన్నారు. దాదాపు 18 ఏళ్లుగా ఒకే కళాశాలలో పని చేస్తూ అనేక ఆరోగ్య, మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ బదిలీలు ఎంతో అవసరమని వారు గుర్తు చేశారు.
2024లో జరిగిన బదిలీల సమయంలోనూ రెండేళ్ల నిబంధన ఉండటంతో, అప్పటికి సర్వీసు పూర్తికాక చాలామంది అవకాశం కోల్పోయారని వారు వివరించారు. ఇప్పుడు మూడు సంవత్సరాల నిబంధన విధిస్తే, మరోసారి బదిలీలకు దూరం కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కావున, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకుల కోసం ప్రత్యేకంగా రెండేళ్ల సర్వీసు నిబంధనను అమలు చేసి, అర్హులైన వారందరికీ బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.
Read Also: 12 ఏళ్లుగా అదే చర్చ జరుగుతోంది.. ఫ్యాన్స్కు కోహ్లీ మాజీ ప్రేయసి వార్నింగ్
Follow Us On: Sharechat

