కలం, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా గడ్డపై 4-1 (Ashes Series) తేడాతో ఎదురైన ఘోర పరాజయంపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు లోతైన సమీక్షకు సిద్ధమైంది. దీనిపై ఇంగ్లాండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ, ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్ సోమవారం లార్డ్స్ మైదానంలో మీడియాతో మాట్లాడనున్నారు. మైదానంలో పేలవ ప్రదర్శనతో పాటు జట్టు క్రమశిక్షణపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. 2025/26 యాషెస్ సిరీస్ (Ashes Series) సమయంలో ఇంగ్లాండ్ ఆటగాళ్ల ప్రవర్తన వివాదాస్పదమైంది. నూసా రిసార్ట్లో ఆటగాళ్లు మితిమీరి మద్యం సేవించారని వార్తలు వచ్చాయి. అంతకుముందు న్యూజిలాండ్ పర్యటనలో వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఒక నైట్క్లబ్ బౌన్సర్తో గొడవకు దిగడం కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అంశాలన్నింటినీ రాబ్ కీ, గౌల్డ్ మీడియా ముందు వివరించే అవకాశం ఉంది.
ప్రారంభంలో ఈ పర్యటనపై ఆటగాళ్లు మాట్లాడకుండా ఈసీబీ ఆంక్షలు విధించాలని ప్రయత్నించింది. అయితే ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో బోర్డు వెనక్కి తగ్గింది. దీనితో ఓలీ పోప్, జేమీ స్మిత్ వంటి ఆటగాళ్లు కౌంటీ మీడియా సమావేశాల్లో పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలో తమ ప్రదర్శన సరిగ్గా లేకపోవడం వల్లే అభిమానుల మద్దతు కోల్పోయామని, మళ్ళీ వారి నమ్మకాన్ని గెలుచుకుంటామని ఓలీ పోప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరోవైపు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ భవిష్యత్తుపై కూడా సందిగ్ధత నెలకొంది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ నిష్క్రమణ తర్వాత ఆయనపై విమర్శలు పెరిగాయి. జట్టు నిర్వహణ చాలా సాధారణంగా ఉందని, సన్నాహకాలు సరిగ్గా లేవని విమర్శలు వస్తున్నా మెకల్లమ్ మాత్రం కోచ్గా కొనసాగాలని కోరుకుంటున్నారు. సెలక్షన్ పాలసీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ను విస్మరిస్తున్నారనే ఆరోపణలపై బోర్డు పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

