కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకు చెవిలోపూలు పెట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (MLA KP Vivekananda) మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ ప్రజలను వంచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చేదే హైదరాబాద్ నుంచి అని.. హైదరాబాద్ నూతన కార్పొరేషన్లకు ఒక్క రూపాయి బడ్జెట్లో పెట్టలేదని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ నిర్మాణాలకు చదరపు అడుగుకు రూ. 100 నుంచి 200 వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో విలువైన భూములపై కన్నేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ తాగునీటి సమస్యపై బడ్జెట్లో ప్రస్తావనే లేదని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. రాష్ట్ర జనాభాలో హైదరాబాద్లో నివసించే జనాభా 50 శాతం పైగా ఉంటుందని చెప్పి, బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సేకరించిన ఫార్మా సిటీ భూములను పప్పు బెల్లాల్లా అమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ప్రజల చెవుల్లో పూలు పెట్టారని దుయ్యబట్టారు.

