కలం, మెదక్ బ్యూరో : ప్రజల ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్లకు నెలకు 18,000 వేతనం, ESI, PF, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు సంగారెడ్డి (Sangareddy) పట్టణంలోని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) ఇంటిని ముట్టడించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు నెలకు 18,000 జీతం ఇస్తామని హామీ ఇచ్చి.. దాదాపు 26 నెలలు గడిచినప్పటికీ, ఆ హామీ అమలు చేయకపోవడం ఆశా వర్కర్ల ఆగ్రహానికి కారణమైంది.
ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీతం బకాయిలను వెంటనే చెల్లించాలని, సమస్యలను పరిష్కరించాలని ఆశా వర్కర్లు(ASHA Workers) భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ANC, PNC టార్గెట్లు రద్దు చేసి పనిభారం తగ్గించాలి. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలు అందిస్తున్నప్పటికీ, ప్రభుత్వం తమ కష్టాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆశా వర్కర్లు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా తెలంగాణ ఆశా వర్కర్లు యూనియన్ (CITU) ఆధ్వర్యంలో, మంత్రి ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు పోరాటం కొనసాగిస్తామని ఆశా వర్కర్లు ప్రకటించారు.

