కలం, జనగామ : ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా సోమవారం జనగామ (Jangaon) జిల్లా కేంద్రంలో “ఈట్ రైట్ – వాక్” (Eat Right Walk) ర్యాలీని అట్టహాసంగా నిర్వహించారు. 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నెహ్రూ పార్కు నుంచి హైదరాబాద్ రోడ్డులోని లైఫ్ కేర్ ఆసుపత్రి వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అత్యవసరమని పేర్కొన్నారు.
ఫాస్ట్ ఫుడ్ సంస్కృతికి దూరంగా ఉండి, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు వంటి సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ద్వారానే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన పిలుపునిచ్చారు. ర్యాలీలో (Eat Right Walk) పాల్గొన్న విద్యార్థులు, వైద్య సిబ్బంది “ఈట్ రైట్ – లివ్ హెల్తీ” అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులతో ప్రజలను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, ఆహార భద్రత అధికారి సుధీర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ వినీల్ కుమార్, విద్యా శాఖ ఏడీ సత్యనారాయణ మూర్తి, డాక్టర్లు అశోక్ కుమార్, కమల్ హాసన్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, హోటల్ యాజమాన్యాలు పాల్గొన్నారు.
Read Also: మావోయిస్టు పార్టీ కీలకనేత సోది కేశాలు లొంగుబాటు..
Follow Us On: Facebook

