కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో (Hormuz Strait) ఓ నౌకపై డ్రోన్ దాడి జరిగింది. దీనిలో 21 మంది భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరంతా సురక్షితంగానే ఉన్నారు. హాంకాంగ్ జెండాతో వెళ్తున్న బోషెం మ్యారింగో అనే ట్యాంకర్ నౌకపై దాడి జరగడంతో కొంతభాగం ధ్వంసమైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. సిబ్బంది భయకంపితులయ్యారు. ఈ ఘటనకు ముందు ఎలాంటి హెచ్చరికలు రాలేదని నౌక సిబ్బంది చెబుతున్నారు. దాడి జరిగిన తరువాత హుజేరా తీరంలో నౌకను లంగర్ వేశారు. ఇరాన్ ఆధ్వర్యంలోని ఐఆర్జీసీనే డ్రోన్లు ప్రయోగించి ఉంటుందని ప్రాథమిక సమాచారం. దీన్ని ధ్రువీకరించాల్సి ఉంది.
ఒప్పందం కుదిరినా.. దాడులు ఆగేనా!
ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు ఇరు దేశాలు అంగీకరించాయి. అయినా హర్మూజ్ జలసంధిలో గందరగోళ పరిస్థితులు సద్దుమణగాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఉన్నఫళంగా జలసంధిపై ఇరాన్ పర్యవేక్షణ విరమించుకోకపోవచ్చని.. ఒప్పందం కుదిరినా అగ్రరాజ్యంపై ఇరాన్ ఇంకా సందేహంగానే ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. తమ ఆదేశాలను ఉల్లంఘించే నౌకలపై ఐఆర్జీసీ దాడులకు తెగబడే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

