కలం, స్పోర్ట్స్ : మహిళల క్రికెట్లో వరుస రికార్డులతో దూసుకెళ్తున్న స్మృతి మంధాన(Smriti Mandhana)కు మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ (Diana Edulji) గట్టిగా డిమాండ్ చేశారు. దుబాయ్లో హాంగ్కాంగ్తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్లో స్మృతి మంధాన 124 పరుగులతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మిథాలీ రాజ్ రికార్డును దాటేశారు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా 18 సెంచరీలు చేసిన తొలి మహిళా బ్యాటర్గా చరిత్ర సృష్టించారు. పొట్టి ఫార్మాట్లో రెండు సెంచరీలు చేసిన మొదటి భారత మహిళగా కూడా రికార్డు నమోదు చేశారు.
ఈ ఘనత సాధించిన స్మృతిని మిథాలీ రాజ్ సామాజిక మాధ్యమాల వేదికగా అభినందించారు. తన రికార్డును స్మృతి తిరగరాయడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ సెలక్షన్ కమిటీ ఇకనైనా నిర్ణయం తీసుకోవాలని డయానా ఎడుల్జీ (Diana Edulji) సూచించారు. స్మృతికి వెంటనే కెప్టెన్సీ ఇవ్వాలన్నారు. హర్మన్ప్రీత్ కౌర్ వయసు ఇప్పటికే 37 ఏళ్లకు చేరిందని ఆమె గుర్తుచేశారు. బ్యాటింగ్పై దృష్టి పెట్టేందుకు హర్మన్ను కెప్టెన్సీ ఒత్తిడి నుంచి తప్పించడమే మంచిదని అభిప్రాయపడ్డారు.
స్మృతి వయసు ప్రస్తుతం 30 ఏళ్లు ఉన్నందున, సుదీర్ఘకాలం జట్టును నడిపించేందుకు ఇది సరైన సమయమని అన్నారు. ఇప్పటికిప్పుడు జెమిమా, లేదంటే షెఫాలీకి వైస్ కెప్టెన్సీ ఇచ్చి భవిష్యత్తు కోసం సిద్ధం చేయవచ్చని చెప్పారు. గతంలో వైస్ కెప్టెన్ స్మృతిని కెప్టెన్సీకి సిద్ధమా అని ప్రశ్నించగా, తను నాయకత్వానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు, ఆసియా కప్, ఆసియా గేమ్స్కు హర్మన్నే కెప్టెన్గా బీసీసీఐ కొనసాగిస్తోంది. ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్ కూడా హర్మన్ నాయకత్వానికే మద్దతు పలికారు.
Also Read : క్రికెట్లో వయస్సు మోసం.. బీసీసీఐ సంచలన నిర్ణయం!
Follow Us On: Instagram

