కలం, హనుమకొండ : ఆన్లైన్ లో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇదే పెట్టుబడిగా మార్చుకున్న సైబర్ నిందితుడు ఓ వ్యక్తి వద్ద ఏకంగా రూ.15 లక్షలు దోచుకున్నాడు. వరంగల్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తుమ్మ ఉదయ్కిరణ్ (32)ను Y99 యాప్లో ‘లావణ్య’ పేరుతో మహిళగా నటిస్తూ నిందితుడు పరిచయం పెంచుకున్నాడు. ఉదయ్ నమ్మకాన్ని పొందిన తర్వాత హనీట్రాప్ (Honeytrap)కు పాల్పడ్డాడు.
అత్యవసర అవసరాలు, విద్య పరిశోధన, వైద్యం, వ్యక్తిగత ఖర్చుల పేరుతో భావోద్వేగ ఒత్తిడి తెచ్చి పలుమార్లు డబ్బులు బదిలీ చేయించుకున్నాడు. ఇలా వివిధ బ్యాంకు ఖాతాలు, యూపీఐ ద్వారా మొత్తం రూ.14,75,100 కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో వరంగల్ సైబర్ క్రైమ్ పీఎస్లో కేసు నమోదైంది.
సాంకేతిక, ఆర్థిక లావాదేవీల ఆధారాలతో నిందితుడి ఆచూకీ గుర్తించిన ప్రత్యేక బృందం తమిళనాడులోని సేలం జిల్లాలో అతడిని అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టులో హాజరుపరిచి శుక్రవారం రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ కె.అశోక్కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. ఆన్లైన్ పరిచయస్తులకు వ్యక్తిగత, బ్యాంకు వివరాలు ఇవ్వొద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు.

