కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ పరిధిలోని మాక్స్ సొసైటీ రోడ్డు ఆక్రమణ వివాదంపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి (MLC Anji Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. 1999లో బీహెచ్ఈఎల్ రిటైర్డ్ ఉద్యోగులు ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేసిన ఇండ్ల స్థలాలకు సంబంధించి హెచ్ఎండీఏ అనుమతితో 60 అడుగుల రోడ్డును కేటాయించారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత బీహెచ్ఈఎల్ అధికారులు అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో ఫెన్సింగ్ వేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.
ఈ సమస్యను స్థానికులు ఎమ్మెల్సీ అంజిరెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ డీసీ ప్రదీప్ కుమార్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రజల రాకపోకలకు కేటాయించిన రహదారిని ఆక్రమించడం చట్టవిరుద్ధమన్నారు. తక్షణమే రోడ్డు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ఆక్రమణకు పాల్పడినవారిపై వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని స్థానికులకు సూచించారు.

