కలం, స్పోర్ట్స్: భారత క్రికెట్లో వయస్సు మోసం కలకలం రేపింది. బెంగాల్ కుర్రాడు, అండర్-19 జట్టు స్పిన్నర్ రోహిత్ యాదవ్పై బీసీసీఐ (BCCI) రెండేళ్ల పాటు నిషేధం విధిస్తూ ఇవాళ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన రోహిత్ యాదవ్ బెంగాల్ తరుఫున ఏజ్ గ్రూప్ క్రికెట్ ఆడుతున్నాడు. గత జులైలో భారత అండర్-19 జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు వెళ్లాడు. ఆ పర్యటనలో ఆరు వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ఆ సత్తాతోనే ఈ నెలలో ఆస్ట్రేలియాతో జరగబోయే స్వదేశీ సిరీస్కు కూడా ఎంపికయ్యాడు. అయితే శ్రీలంక పర్యటన సమయంలోనే రోహిత్ వయస్సు పత్రాలపై అనుమానాలు వచ్చాయి. అతని వద్ద 2007, 2009, 2010 సంవత్సరాలతో కూడిన మూడు వేర్వేరు జనన ధ్రువీకరణ పత్రాలు ఉన్నట్లు తేలింది. వయస్సు నమోదులో సుమారు 27 నెలల తేడా ఉందని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ గుర్తించింది. దీంతో బీసీసీఐ రోహిత్పై తక్షణమే నిషేధం విధించింది.
ఈ వ్యవహారం రోహిత్తోనే ఆగలేదు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 62 మంది క్రికెటర్ల వయస్సు పత్రాల్లో తేడాలు బయటపడ్డాయి. వీరిని రాబోయే రెండు సీజన్లకు నిషేధిస్తున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది. ఈ జాబితాలో 2022 అండర్-19 ప్రపంచకప్ విజేత జట్టు సభ్యుడు రవికుమార్ కూడా ఉండడం గమనార్హం. యువ క్రికెటర్ల భవిష్యత్తును కాపాడేందుకు, పారదర్శకత పెంచేందుకు క్రికెట్ బోర్డులు ఇలాంటి చర్యలు చేపడుతున్నాయి.

