కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశారదన్ మహారాజ్ (Visharadan Maharaj) నిప్పులు చెరిగారు. భూదాన్ బాధితుల సమస్యలను గాలికి వదిలేసి మంత్రి 40 ఏళ్ల సంబరాలు చేసుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన భూదాన్ బాధితుల సమావేశంలో విశారదన్ మహారాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేడుకలపై విశారదన్ మహారాజ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వందల మంది భూదాన్ బాధితులు తమ హక్కుల కోసం రోడ్లపై పోరాడుతుంటే.. మంత్రి మాత్రం 40 ఏళ్ల పండగ చేసుకుంటున్నారు. ప్రజా సమస్యలను విస్మరించి జరుపుకునే వేడుకలకు విలువేముంది?” అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా విశారదన్ మహారాజ్ అత్యంత ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. బాధితులకు ఇళ్లు కట్టించి ఇవ్వడం మంత్రి బాధ్యత అని, ఒకవేళ ఆ పని చేయకపోతే… “నీకు గోరీ కట్టడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం” అని హెచ్చరించారు. బాధితుల సహనాన్ని పరీక్షించవద్దని, తక్షణమే ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
‘గోరీ’కడతాం.. మంత్రి తుమ్మలకు విశారదన్ మహారాజ్ వార్నింగ్

