కలం, వెబ్ డెస్క్: వైసీపీ పార్టీపై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గొడ్డలి పార్టీ రోజుకో మాట మాట్లాడుతోందని, ఎన్నికలకు ముందు ఒకటి, తర్వాత మరొకటి మాట్లాడుతోందని మండిపడ్డారు. అమరావతిని ఆపడం ఎవరి తరమూ కాదు అని స్పష్టం చేశారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెడతామని చెప్పి, కేవలం రెండేళ్లలోనే మాట నిలబెట్టుకున్నామని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాష్ట్రంలో రూ.28 వేల కోట్లతో వివిధ పథకాలు చేపడుతున్నామని చెప్పారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కావారిపల్లె వేదికగా సీఎం మాట్లాడుతూ.. రాయలసీమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. త్వరలోనే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతామని సీఎం హామీ ఇచ్చారు. రాయలసీమ దేశంలోనే ఉద్యాన పంటలకు కేంద్రంగా మారుతుందని, త్వరలో రూ.40 వేల కోట్ల ప్రభుత్వ, రూ.60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు తెస్తామని ప్రకటించారు. మదనపల్లిలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే సత్యవేడులో హీరో మోటార్స్ ఉన్నాయని, త్వరలో తిరుపతిలో బుల్లెట్ మోటార్ సైకిల్ తయారీ ప్లాంట్ రాబోతోందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను నిలబెట్టడంతో పాటు రైల్వే జోన్ సాధించామని సీఎం వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అడిగిన వెంటనే తోతాపురి మామిడి రైతుల సమస్యలు తీర్చారని తెలిపారు. రహదారులు, పీఎంఏవై గృహాల కోసం రాష్ట్రానికి నిధులు కేటాయించారని వివరించారు.

