కలం, వెబ్ డెస్క్ : కేసీఆర్ ను కష్టకాలంలో ఆదుకున్న పాలమూరు జిల్లాను ఆయన పట్టించుకోలేరని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిన సీఎం పాలమూరు ఎత్తిపోతల పథకంతో పాటు పలు రిజర్వాయర్లను, పంప్ హౌజ్ లను పరిశీలించారు. అనంతరం సీఎం జడ్చర్లలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు.
సీఎం అయిన తరువాత పాలమూరు ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేస్తామనుకున్నామని చెప్పారు. కానీ, పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం కేసీఆర్ రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. వీటిలో పంపు హౌస్ లు, లిఫ్టులు మాత్రమే కట్టి కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. కానీ, ఈనాటికి భూసేకరణ పూర్తి కాలేదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

