కలం, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ రద్దుపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Rajanarsimha) స్పందించారు. నీట్ పరీక్ష రద్దు కావడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 70 వేల మంది, దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈసారి నీట్ రాసి.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. వారి భవిష్యత్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇబ్బందుల్లోకి నెట్టిందని మండిపడ్డారు. నీట్ నిర్వాహణలో ఎన్టీఏ పూర్తిగా విఫలమైందని తెలిపారు. గతంలో జరిగిన ఘటనల నుంచి నేర్చుకుని, పకడ్బందీగా పరీక్ష నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు.
ఎన్టీఏ (NTA) నిర్లక్ష్యం నీట్ పరీక్ష రాయనున్న 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్కు ప్రమాదకరంగా పరిణమించిందని చెప్పారు. పరీక్ష రద్దు కావడంతో ఎంతో మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా సరియైన రీతిలో స్పందించి.. ఇంత పెద్ద తప్పిదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి (Damodar Rajanarsimha) చెప్పారు.
కాగా, నీట్ యూజీ- 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. ప్రశ్నపత్రం లీక్ వార్తల నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నీట్ పరీక్ష లీక్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశాలు జారీ చేయగా.. పరీక్ష మళ్లీ నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. త్వరలో నీట్ యూజీ పరీక్ష తేదీలు ప్రకటించనున్నట్లు వివరించింది. దేశ వ్యాప్తంగా మే 3న జరిగిన నీట్ యూజీ- 2026 జరిగిన విషయం తెలిసిందే.
Read Also: నా కొడుకు నిప్పు… నిందలు వేసినవాళ్ళను వదిలిపెట్టను: బండి సంజయ్
Follow Us On: Instagram

