కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 38 ప్రకారం పారదర్శకంగా డాక్టర్ల బదిలీల ప్రక్రియ చేపడుతామని మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Rajanarasimha) అన్నారు. సెక్రటేరియట్లోని మంత్రి చాంబర్లో గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సోమవారం మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో జనరల్ ట్రాన్స్ఫర్లు పారదర్శకంగా జరిగాయని తెలిపారు. ఈసారి కూడా అదే విధంగా ట్రాన్స్ఫర్లు ఆఫ్ లైన్ లో చేయాలని వైద్యులు కోరినట్లు వివరించారు. టీజీడీఏ ఆఫీస్ బేరర్లకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని, రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నవారికి కూడా బదిలీల్లో అవకాశం ఇవ్వాలని డాక్టర్లు కోరారని వివరించారు. జిల్లాల్లోని మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న వారికి హైదరాబాద్లోని కాలేజీల్లోకి వచ్చేందుకు అవకాశం ఇవ్వాలని డాక్టర్లు విజ్ఞప్తి చేశారని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి (Damodar Rajanarasimha) మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం పారదర్శకంగా వైద్యుల ట్రాన్స్ఫర్లు చేపడుతామని అన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యను బలోపేతం చేయడంతో పాటు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా హాస్పిటళ్లను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇందుకు డాక్టర్ల సంపూర్ణ సహకారం అవసరం అని మంత్రి పేర్కొన్నారు. కాలేజీలు, హాస్పిటళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని జీవో ప్రకారం ట్రాన్స్ఫర్లు ఉంటాయని చెప్పారు. అడ్మినిస్ట్రేషన్, టీచింగ్, క్లినికల్ వర్క్కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లాల్లోని కాలేజీలు, హాస్పిటళ్లలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నవారికి బదిలీల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు .ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, జాయింట్ సెక్రటరీ అయేషా, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యనారాయణ, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరహరి, జనరల్ సెక్రటరీ లాలూ ప్రసాద్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: రియల్ మాడ్రిడ్లో ముసలం.. కోచ్ మారే అవకాశం?
Follow Us On : WhatsApp

