కలం, నిజామాబాద్ బ్యూరో : సిపిఎం (CPM) రాష్ట్ర కమిటీ సభ్యురాలు, సీఐటీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ (45) (Noorjahan) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతు శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో కార్మిక ఉద్యమాలకు, ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు పెద్ద దిక్కు కోల్పోయినట్టైంది. నూర్జహాన్ జీవితం మొత్తం పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ, మున్సిపల్ తదితర రంగాల్లో పనిచేసే కార్మికుల హక్కుల సాధన కోసం నూర్జహాన్ (Noorjahan) నిరంతరం పోరాటాలు నడిపారు. తక్కువ వేతనాలు, అసమాన పని పరిస్థితులు, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి సమస్యలపై ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపి, కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు.
కేవలం ఆందోళనలు మాత్రమే కాకుండా, స్థానిక స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలను అధికారులతో చర్చల ద్వారా పరిష్కరించడంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు. కార్మికుల ప్రతి సమస్యను తన సమస్యగా భావించి, వారి మధ్యే ఉండి వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యమయ్యారు.
ఒక దశలో అడవుల్లో అజ్ఞాత జీవితం గడిపిన నూర్జహాన్, ఆ తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చి సీపీఎం పార్టీతో కలిసి ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. కష్టకాలాల్లో వెనుకడుగు వేయని ధైర్యసాహసాలు, అంకితభావం ఆమెను ప్రత్యేక నాయకురాలిగా నిలిపాయి. నూర్జహాన్ మరణం కార్మిక ఉద్యమాలకు తీరని లోటుగా భావిస్తూ, పార్టీ నాయకులు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. నూర్జహాన్ కి భర్త ఆనంద్ (ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు), కొడుకులు అబ్బాస్, ఆజాద్ ఉన్నారు.
నివాళులు అర్పించిన ప్రముఖులు..
నూర్జహాన్ మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు. సిపిఎం (CPM) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అబ్బాస్, నాటక మండలి సభ్యులు ప్రసాద్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ జయలక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత కార్యదర్శి పి వెంకట్, భాస్కర్, ఎస్ శ్రమ, సిపిఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కామారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, నిజామాబాద్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్ద వెంకట రాములు, పల్లపు వెంకటేష్, శంకర్ గౌడ్, నాయకులు నివాళులు అర్పించారు.

