కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్లో (Karimnagar) సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కోర్టు చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి, బండి సంజయ్ (Bandi Sanjay) రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ..ఒక మైనర్ బాలికపై వేధింపులు, అత్యాచారం కేసులో ఆయన కుమారుడు బండి భగీరథ్ను తొమ్మిది రోజుల పాటు దాచిపెట్టినట్లు ఆరోపించారు.
కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతోనే అతడిని సరెండర్ చేయించారని అన్నారు. అయితే అతడిని నిజంగా అరెస్టు చేశారా లేదా సరెండర్ చేశారా అన్నది ఇంకా స్పష్టత లేదని పేర్కొన్నారు. బండి సంజయ్ కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్న కారణంగా కేసు విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అందుకే ఆయన ఎంపీ పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కేంద్ర ప్రభుత్వం ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని కూడా సిపిఎం నాయకులు కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు, పుల్లెల మల్లయ్య, పున్నం రవి, ఆసంపల్లి వినయ్, నాయకులు రాయికంట శ్రీనివాస్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.
Read Also: బీజేపీలో కొత్త సంక్షోభం.. నేతలకు కీలక ఆదేశాలు!
Follow Us On: WhatsApp

