కలం, వరంగల్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాను విస్మరించారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ఆయన స్పందిస్తూ హైదరాబాద్ పై పెట్టిన శ్రద్ధ వరంగల్ పై దృష్టి పెట్టలేదని తెలిపారు. వరంగల్ (Warangal) అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు, కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమల ఊసే లేదని విమర్శించారు. అలాగే దేవాదుల ఎత్తిపోతల పథకం సకాలంలో పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదని, పేదల పెన్నిది అయిన వరంగల్ ఎంజీఎంకు అవసరమైన నిధులు కేటాయించలేదని తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నిరుద్యోగ భృతి అంశాన్ని ప్రస్తావించకుండా మరోసారి గత ప్రభుత్వాల మాదిరిగానే నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల అర్హులైన మహిళలకు రూ. 2500 వారి ఖాతాలో జమ చేస్తామన్న హామీ నెరవేర్చలేదని పేర్కొన్నారు. అలాగే రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా సకాలంలో అందించడం లేదన్నారు. వరంగల్ నగరంలోని మురికి వాడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక బడ్జెట్ లో లేదని శ్రీనివాసరావు అన్నారు.

