కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో భూముల వ్యవహారంపై చర్చ హాట్హాట్గా సాగుతోంది. ఈ సందర్భంగా కేటీఆర్పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) సభలో సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి కష్టపడి సంపాదించిన సొంత భూమిని కేటీఆర్ అక్రమంగా ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో భయం వల్ల మౌనంగా ఉన్నామని, ఈ కబ్జాపై సమగ్ర విచారణ కోసం హౌస్ కమిటీ వేయాలని దానం డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను సభ ముందు ఉంచుతానని చెప్పారు.
అటు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ. 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అక్రమంగా కబ్జాకు గురయ్యాయని మండిపడ్డారు. భూ అక్రమాలకు సంబంధించి తన వద్ద సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన ఆధారాలు పక్కాగా ఉన్నాయని చెప్పారు. తాను చేసిన ఆరోపణలను నిరూపించలేకపోతే.. 24 గంటల్లోగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఈ భారీ భూ కుంభకోణంపై వాస్తవాలు బయటకు రావాలంటే తక్షణమే హౌస్ కమిటీ లేదా సీఐడీతో సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సభలో విజ్ఞప్తి చేశారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి (Yashaswini Reddy) సైతం అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభలో కొత్త సభ్యులకు ఎలాంటి సంస్కృతిని నేర్పిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభ్యుల అనుచిత ప్రవర్తన వల్ల సభా సమయం వృధా అవుతోందని ఫైర్ అయ్యారు. తండ్రి సమానులైన సీనియర్ నేత కడియం శ్రీహరిని అవమానించిన పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని స్పీకర్ ను కోరారు. సభను నిబంధనల ప్రకారం ఆర్డర్లో పెట్టాలని ఆమె స్పీకర్కు విజ్ఞప్తి చేశారు.

