కలం, వెబ్ డెస్క్ : ఈ నెల 16 నుంచి 18 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు హాజరు కావాలని కాంగ్రెస్ లోక్ సభ ఎంపీలకు (Congress MPs) ఆ పార్టీ అధిష్ఠానం త్రీ – లైన్ విప్ (3 Line Whip) జారీ చేసింది. ఈ సమావేశాల్లో సభలో కీలక అంశాలపై చర్చ, ఓటింగ్ జరగనున్నాయని పార్టీ ప్రకటనలో పేర్కొంది. నారీ శక్తి వందన అధినియమ్ సవరణ బిల్లుపై పార్టీ వైఖరికి మద్దతు ఇవ్వాలని ఎంపీలను కోరింది. సభ జరిగే మూడు రోజుల పాటు అందుబాటులో ఉండాలని, పార్టీ తీసుకునే నిర్ణయాలను మద్దతుగా నిలవాలని విప్ లో ఆదేశించింది.
కాగా, ఈ సమావేశాల్లో డీలిమిటేషన్, చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనుండడంతో కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా రూపొందించిన డీలిమిటేషన్ బిల్లు వల్ల లోక్ సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే బిల్లుకు వ్యతిరేకంగా తన మిత్ర పక్షాలను ఏకం చేయడం కోసం ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నియోజకవర్గాల పునర్విభజన పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును అత్యంత ప్రమాదకరమైనది, రాజ్యాంగంపై దాడిగా ఆమె అభివర్ణించారు.
త్రీ – లైన్ విప్ (3 Line Whip) అనేది పార్టీ జారీ చేసే అత్యంత కఠినమైన ఆదేశం. దీని ప్రకారం సభ్యులు సమావేశాలకు తప్పనిసరిగా హాజరై పార్టీ విధానం ప్రకారం ఓటు వేయాల్సి ఉంటుంది. విప్ ను ఉల్లంఘించిస్తే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతకు దారితీసే అవకాశాలు లేకపోలేదు.
Read Also: ప్రభుత్వ ఉద్యోగం పేరుతో కోట్ల కట్నం డిమాండ్.. ఘరానా మోసగాడి అరెస్ట్
Follow Us On: Facebook

