కలం, జనగామ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) పేర్కొన్నారు. శనివారం స్టేషన్ ఘనపూర్ మండలం పామునూర్, చిల్పూర్ రాజవరం, చిన్నపెండ్యాల గ్రామాల్లో ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన రిబ్బన్ కట్ చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3 లక్షల వరకు రుణ మాఫీ, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సహాయం, సన్నాలకు బోనస్, మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, వ్యవసాయ యాంత్రికరణకు 50 శాతం సబ్సిడీ వంటి పథకాలను అమలు చేస్తూ రైతుకు అండగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని, ఒక్క స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోనే లక్ష ఎకరాలలో వరి, 20వేల ఎకరాలలో మొక్కజొన్న సాగు చేస్తున్నారని అన్నారు. అందుకు కారణం దేవాదుల ప్రాజెక్టు అని తెలిపారు.
దేవాదుల ద్వారా గోదావరి జలాలు పొలాలకు చేరడంతో పంట దిగుబడి పెరగడంతో పాటు నాణ్యత కూడా పెరిగిందని వెల్లడించారు. రైతులు ఆర్థికంగా నష్టపోకూడదనే ఉదేశ్యంతో ప్రభుత్వమే మద్దతు ఇచ్చి దాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు ధాన్యం కొనుగోలుతో సీజన్ కు ప్రభుత్వానికి రూ.5 వేల కోట్ల నష్టం వస్తుందని అయినప్పటికీ రైతులకు అండగా నిలుస్తుందన్నారు. వరి ధాన్యం కొనుగోలుకు 23వేల కోట్లు, మక్కల కొనుగోలుకు 5వేల కోట్లు ప్రభుత్వం రుణంగా తీసుకుందని రైతులు పంట అమ్మిన 3, 4 రోజులలోనే డబ్బులు రైతుల ఖాతాలలో జమ అవుతాయాని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలని సద్వినియోగం చేసుకొని మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముకోవాలని ఆయన (Kadiyam Srihari) సూచించారు.
మహిళా సంఘాలకు అత్యధికంగా కేంద్రాలు
స్టేషన్ ఘనపూర్ (Station Ghanpur) నియోజకవర్గంలో అత్యధిక కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకే కేటాయిస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలకు కేటాయించడం ద్వారా రెండు రకాల లాభాలు ఉన్నాయని మహిళా బాధ్యతగా పని చేస్తారని అలాగే ఉపాధి తో పాటు ఆదాయం వచ్చి మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడుతాయాని వెల్లడించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నానని అన్నారు. దానికి మీ అందరి సహకారం, ఆశీర్వాదం కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ఆర్డివో వెంకన్న, డిఆర్ డిఏ పీడీ నూరోద్దీన్, తహసీల్దార్, ఎంపిడివో, వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: మసాజ్ సెంటర్లో మోడీ..! సోషల్ మీడియాలో వీడియో వైరల్
Follow Us On: Sharechat

