కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ భారతీయ జనతా పార్టీ (Telangana BJP) లో అంతర్గత విభేదాలను సరిదిద్దేందుకు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. రాష్ట్ర పార్టీలో నెలకొన్న తాజా పరిస్థితులు, అంతర్గత సమస్యలపై హైకమాండ్కు అందిన నివేదిక ఆధారంగా అగ్ర నాయకత్వం దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. ముఖ్యంగా పార్టీలోని కీలక నేతల మధ్య ఉన్న ఈగో సమస్యలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీలో అగ్ర నాయకులైన బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు అధిష్టానం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లోని ఎంపీ లక్ష్మణ్ నివాసంలో ఈ సయోధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈటల రాజేందర్, బండి సంజయ్ ఒకరితో ఒకరు ముఖాముఖి భేటీ అయినట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ నేత అభయ్ పాటిల్తో పాటు ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో ఈ సమన్వయ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ భేటీతో రాష్ట్ర బీజేపీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు తెరపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

