ఖమ్మంలో ఘనంగా డీసీసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) నగరంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) జడ్పీ సర్కిల్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జడ్పీ సెంటర్ నుంచి సంజీవరెడ్డి భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ సహా జిల్లా కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తదుపరి కాంగ్రెస్ కార్యాలయంలో రాష్ట్ర గీతం ఆలపించి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయడం గొప్ప విషయమని అన్నారు.

రాజ్యాంగం ఇచ్చిన సమానత్వం, హక్కులను కాపాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. దేశానికి స్వాతంత్రం సాధించడం, రాజ్యాంగాన్ని అందించడం, పంచవర్ష ప్రణాళికల ద్వారా అభివృద్ధికి పునాదులు వేయడం కాంగ్రెస్ పార్టీ గొప్పతనమని ఆయన వివరించారు. జిల్లా స్థాయిలో లభించిన పదవులు గౌరవప్రదమైనవని, వాటిని బాధ్యతగా నిర్వహించాలని  సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని పేర్కొన్నారు. రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వమే సాధించిందని అన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.  రాష్ట్రంలోని కోటి 6 లక్షల కుటుంబాలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున అందిస్తున్నామని వెల్లడించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి సుమారు రూ.10,000 కోట్ల లాభం చేకూర్చినట్లు తెలిపారు.

రాబోయే ఐదేళ్లలో మహిళా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద భీమా, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రోడ్లు, నీటి పారుదల ప్రాజెక్టులను వేగంగా అమలు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కష్టపడే కార్యకర్తలను గుర్తించి గౌరవిస్తామని స్పష్టం చేశారు. గతంలో కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి, ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, మాలోతు రామ్ దాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

Read Also: అసలైన నిద్ర రహస్యం అదే.. ఆలియా భట్ ప్రశ్నకు సద్గురు సమాధానం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>