కలం, జనగామ : జనగామ (Jangaon) జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Collector Sandeep Kumar Jha) బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా బస్టాండ్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బస్టాండ్లో తాగునీటి సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్, అక్కడ అందిస్తున్న నీటిని స్వయంగా పరీక్షించి పరిశుభ్రత, నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణికులకు శుభ్రమైన నీరు అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
అలాగే ప్రయాణికులు ఎక్కువసేపు వేచి ఉండకుండా టికెట్లను వేగంగా జారీ చేయాలని, బస్సులు ఆలస్యం లేకుండా నడపాలని డ్రైవర్లు, కండక్టర్లకు సూచించారు. సేవలలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం ప్రధానంగా భావించి పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ తనిఖీల్లో సంబంధిత అధికారులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

