Mobile Popup Ad
Mobile Popup Ad

గద్వాల జిల్లాలో భూసేకరణ వేగవంతం చేయాలి : కలెక్టర్ రిజ్వాన్ బాషా

కలం, జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లాలో ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Rizwan Basha Shaik) అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో  కలిసి నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పథకాలతో పాటు మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లాలో భూసేకరణ ఆలస్యం కావడంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని తెలిపారు. రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్ శాఖలతో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు సమన్వయంతో పనిచేసి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

గట్టు ఎత్తిపోతల పథకంలో రిజర్వాయర్, కాలువల నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే నెట్టెంపాడు పథకంలో పెండింగ్‌లో ఉన్న 541 ఎకరాలలో గత 15 రోజులలో 56 ఎకరాలకు ప్రిలిమినరీ డిక్లరేషన్ ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన భూసేకరణను కూడా వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు.

రైతుల నుంచి అభ్యంతరాలు వచ్చినట్లయితే గ్రామాలలో సమావేశాలు నిర్వహించి ప్రాజెక్టుల అవసరాన్ని వివరించి వారికి అవగాహన కల్పించాలని అన్నారు. ఇకపై ప్రతి శుక్రవారం భూసేకరణ పురోగతిపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులు నిరంతరం పురోగతిని నమోదు చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ, ఆర్డీవో శ్రీనివాసరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్, కలెక్టరేట్ ఏవో భూపాల్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ ఈఈలు సంజీవ్ ప్రసాద్, శ్రీనివాసులు, ఇతర ఇంజనీర్‌లు, ఆయా మండలాల తహసిల్దార్‌లు, సర్వే అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>