కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) రూరల్ మండలం రత్నాపూర్ కాండ్లి గ్రామంలో మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ గ్రామస్తులకు తడి చెత్త, పొడి చెత్త సేకరణ కోసం బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందజేస్తున్న తడి, పొడి చెత్త బుట్టలను నిర్దేశిత ప్రయోజనం కోసం మాత్రమే వినియోగించాలని గ్రామస్తులకు సూచించారు.
ఇంటి వద్దే తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం ద్వారా గ్రామ పారిశుద్ధ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన గ్రామ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ హరీష్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

