కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్నగర్ (Mahbubnagar) జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ కూడా పాల్గొన్నారు. కలెక్టర్ ఖుష్బూ గుప్తా ప్రజల ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి సమస్యను జాగ్రత్తగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకుని పరిష్కారం చూపుతామని వినతిదారులకు భరోసా ఇచ్చారు. వెబెక్స్ ద్వారా మహబూబ్నగర్ రూరల్, రాజాపూర్ మండల తహశీల్దార్లు, ఎం.పి.డి.ఓలు, ఎం.పి.ఓలను భూ సర్వే, భూ ఆక్రమణ, ఇందిరమ్మ ఇళ్లు వంటి సమస్యలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో పంచాయతీరాజ్, మున్సిపల్, ఎక్సైజ్, భూ సర్వే, గృహ నిర్మాణం, జిల్లా సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం, రోడ్డు రవాణా, బ్యాంకింగ్, పోలీస్, విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధి శాఖలకు సంబంధించిన మొత్తం 114 వినతులను అధికారులు నమోదు చేశారు. అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సీఎం ప్రజావాణి, కలెక్టర్ ప్రజావాణిలో పెండింగ్ ఫైళ్ళను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. కోర్టు కేసులకు సంబంధించిన ఫైళ్లను జిల్లా న్యాయ శాఖతో సంప్రదించి వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని హెచ్చరించారు. కార్యక్రమంలో డి.ఆర్.ఓ రామ్ రెడ్డి, జడ్. పి.సి.ఇ.ఓ, ఇంచార్జి డి.పి.ఓ వెంకట్ రెడ్డి, డి.ఆర్.డీ.ఓ నరసింహులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

