కలం, వరంగల్ బ్యూరో : గ్రేటర్ వరంగల్ (Warangal) పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు ఆక్రమణలను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ (Collector Chahat Bajpai) తెలిపారు. ఈ కమిటీలో రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, కుడా, సర్వే శాఖల అధికారులు సభ్యులుగా పనిచేస్తారని ఆమె వెల్లడించారు. ఆక్రమణలను గుర్తించి వెంటనే స్వాధీనం చేసుకోవడంతో పాటు వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. నగర అభివృద్ధికి ఆటంకంగా మారిన ఆక్రమణలను పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా ఈ టాస్క్ ఫోర్స్ పని చేయనుందని అధికారులు తెలిపారు.

