కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ (Hanumakonda) జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి (Collector Chahat Bajpai) సోమవారం నగరంలోని వివిధ అభివృద్ధి, పారిశుద్ధ్య, హార్టికల్చర్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులను వేగంగా, నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటగా నాయుడు పెట్రోల్ బంక్ నుంచి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ వరకు సెంట్రల్ మీడియన్లో నాటిన మొక్కలు, వాటి నిర్వహణను కలెక్టర్ పరిశీలించారు. వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా మొక్కలు ఎండిపోకుండా నీరు పోసేలా చూడాలని, కలుపు మొక్కలను తొలగించవలసిందిగా ఆదేశించారు. నగర సుందరీకరణలో హార్టికల్చర్ విభాగం కీలక పాత్ర పోషించాలని సూచించారు.
తదుపరి మట్టేవాడ, రామన్నపేట, లక్ష్మీపురం ప్రాంతాలలో నిర్మించిన అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా నాణ్యత ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అంతేకాక, 26వ డివిజన్లో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు పరిశీలించి పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. వీల్ బ్యారోలను శుభ్రపరచి సమర్థవంతంగా వినియోగించాల్సిందని, నగర పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. తదుపరి, ఉర్సుగుట్ట వద్ద ఉన్న రంగసముద్రంను పరిశీలించి, పబ్లిక్ హెల్త్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఫోర్షోర్ బండ్ను తనిఖీ చేశారు. ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులు సంయుక్తంగా జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించాలని, రంగసముద్రం పూడికతీత కోసం ప్రతిపాదనలు తక్షణమే సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బల్దియా ఈఈ సంతోష్ బాబు, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

